• సర్టిఫికెట్లు రద్దు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్!
విశాలజ్యోతి డెస్క్: తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ లేడీ టీచర్ గుట్టురట్టయింది. నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగం పొందినట్లు తేలడంతో.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..?
2024 డీఎస్సీ (DSC) నోటిఫికేషన్లో బీసీ-ఈ (BC-E) కేటగిరీ కింద 5 ఎస్జీటీ (SGT) పోస్టులను కేటాయించారు. టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన దూదేకుల సనాబేగం అనే అభ్యర్థి బీసీ-ఈ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ ఆధారంగా టీచర్ ఉద్యోగం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్యూటీ కూడా చేస్తున్నారు.
ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజం!
అయితే, సనాబేగం నిజానికి బీసీ-బి (BC-B – దూదేకుల సామాజిక వర్గం) కేటగిరీకి చెందినవారని.. కానీ ఆమె తప్పుడు మార్గంలో బీసీ-ఈ (BC-E – షేక్ సామాజిక వర్గం) సర్టిఫికెట్ పొంది, అక్రమంగా ఉద్యోగం సంపాదించారని పాపన్నపేట మండలానికి చెందిన మహమ్మద్ నవాజ్ అనే మరో అభ్యర్థి జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ యాక్షన్..
ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన రెవెన్యూ మరియు విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణలో సనాబేగం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిరూపణ కావడంతో, అధికారులు ఆ నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో స్పందించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్.. మంగళవారం రోజున ఆమె క్యాస్ట్ మరియు నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టి అక్రమంగా ఉద్యోగాలు పొందితే ఊరుకునేది లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.


