• పరారీలో సబ్ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్
విశాలజ్యోతి డెస్క్:
హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తోటి మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై) సురేష్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2018 బ్యాచ్కు చెందిన సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్తో అతనికి పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సదరు యువతి అతనికి మరింత దగ్గరైంది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంపై ఆమె ఒత్తిడి తీసుకురాగా ఎస్సై సురేష్ ఏవో సాకులు చెప్తూ తప్పించుకోవడం ప్రారంభించాడు. ఈ విషయమై ఇటీవల ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ కూడా జరిగింది. తనను మోసం చేసేందుకే సురేష్ ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన మహిళా కానిస్టేబుల్ అతడిని గట్టిగా నిలదీయడంతో, అతను ఆమెపైనే ఎదురుతిరిగి పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసం పోలీసులు సురేష్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతను తన మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఎస్సై సురేష్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.