VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:16 pm Posted by : DK MEDIA

అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

• ఇంటర్ ఒకేషనల్ ఉత్తీర్ణులకు సువర్ణావకాశం.

• ఇంచార్జి ఆర్జేడీ,డి ఐ ఈ ఓ ఎ. గోపాల్

హనుమకొండ, విశాలజ్యోతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ & ఆర్.డి.ఎస్.డి.ఈ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 13 సోమవారం హనుమకొండలో అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు,అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి ఆర్జేడీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జాబ్ మేళా కన్వీనర్ ఎ. గోపాల్ తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2023 నుంచి 2026 విద్యా సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి నాన్-పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆర్.డి.ఎస్.డి.ఈ నిబంధనల ప్రకారం నెలకు రూ.9,600 స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు రెండు సెట్ల బయోడేటా, విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు.గత మూడు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ. గోపాల్ కోరారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇంటర్మీడియట్ ఒకేషనల్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.